వరంగల్‎లో ఫ్లెక్సీల గొడవ..

మరికాసేపట్లో హన్మకొండ లో బిజెపి భారీ బహిరంగ సభ మొదలుకాబోతుంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ ఇన్‌‌చార్జి సునీల్ బన్సల్ వరంగల్ చేరుకోగా.. కాసేపట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ రానున్నారు. ఇదిలా ఉంటె నగరంలో ఫ్లెక్సీల గొడవ తారాస్థాయికి చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు.

ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాక సర్వత్రా ఆసక్తి గా మారింది . టీఆర్‌ఎస్- బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితుల్లో ఈరోజు నడ్డా ప్రసంగంపైనే అందరి దృష్టి. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, అనుకున్న సమయం లోపే సభ ముగించాలని హైకోర్టు ఆదేశించింది.