బీహార్‌ కల్లీ మద్యం..70కి చేరిన మృతుల సంఖ్య

Bihar Hooch Tragedy: Death Toll In Chhapra Rises To 70

పాట్నాః బీహార్‌ రాష్ట్రం సరాన్‌ జిల్లాలో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఐదు రోజుల క్రితం మొదలైన మరణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయానికి మొత్తం మృతుల సంఖ్య 70కి చేరింది. మంగళవారం రాత్రి సరాన్‌ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. చికిత్స పొందుతూనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీహార్‌లో 2016, ఏప్రిల్‌ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దాంతో మద్యానికి అలవాటు పడిన కొందరు దొంగచాటుగా లభ్యమయ్యే కల్తీ మద్యాన్ని సేవిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 2016 మొదలు ఇప్పటివరకు బీహార్‌లోని ఎక్కడో ఒకచోట తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

కాగా, కల్తీ మద్యం మరణాలపై బీహార్‌లో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ఈ చావులకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమారే కారణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ నితీశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని బీహార్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు సుశీల్‌ కుమార్‌ మోదీ మండిపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తున్న నితీశ్‌ కుమార్‌.. కల్తీ మద్యాన్ని నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కల్తీ మద్యం కాటుకు గడిచిన ఆరేండ్లలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సుశీల్‌ మోదీ చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/