పరామర్శలకు వెళ్లకుండా నిర్భందించడం… ఇదేనా పాలనా?

హైదరాబాద్ : తెలంగాణలో పౌర‌ స్వేచ్ఛను కేసీఆర్ హత్య చేస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..… ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడన్నారు. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోంద‌న్నారు. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నాడన్నారు. ప్రజాగ్ర‌హం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్ లు, ఫాంహౌస్ లు బద్ధలైపోతాయి.. జాగ్రత్త కేసీఆర్ ! అన్నారు. ఇదేం సంస్కారం కేసీఆర్ !?.. అర్థరాత్రి నుండి పోలీసులతో ఇంటిని ముట్టడించడం… అనుమతి లేకుండా ఇంటిలోపలికి జొరబడటం… పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్భందించడం… ఇదేనా కేసీఆర్ నీ పాలనా సంస్కారం.. నీ కుంచిత ఆలోచన అన్నారు.

తెలంగాణ భారత రాజ్యాంగ పరిధిలో రాష్ట్రమనుకుంటున్నావా ? నీ ప్రైవేటు ఎస్టేట్ అనుకుంటున్నావా ? సంస్కారివైతే సమాధానం చెప్పు అని రేవంత్ రెడ్డి సూటిగా అడిగారు. రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్… ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా !? అని అన్నారు. పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు కానీ… పేదరైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా !? నువ్వు ఎలాగూ వెళ్లవు… మేం పరామర్శిస్తుంటే నీకొచ్చిన నొప్పేంటి?..అని రేవంత్ రెడ్డి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/