గంగూలీ ఉండగా అది జరగదు
టెస్టు ప్రతిపాదనపై స్పందించిన షోయబ్ అక్తర్
కరాచి: సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బిసిసిఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రతిపాదనను వ్యతిరేకించడం ఖాయమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ధీమా వ్యక్తం చేశారు. గంగూలీ ఓ క్రికెట్ మేధావి, దాదా ఉండగా అది జరగదు అని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనికి అతడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు. బిసిసిఐ అంగీకారం లేనిదే ఐసిసి నాలుగు రోజుల టెస్టును నిర్వహించలేదని అక్తర్ అన్నారు. ఐసిసి ప్రతిపాదనకు ఎవ్వరూ సానుకూలంగా స్పందించడం లేదని, ఇదొక చెత్త నిర్ణయమని షోయబ్ విమర్శించారు. ఇప్పటికే సచిన్, గౌతం గంభీర్, మెక్గ్రాత్, రికీ పాంటింగ్ లాంటి వాళ్లు దీనిని వ్యతిరేకించారని, దీనిపై ఎవరూ ఆసక్తి చూపకూడదు అని ఆయన అన్నారు. ఇక పాకిస్థాన్ క్రికెట్ పెద్దలు కూడా దీనిని స్పందిచి, వ్యతిరేకత చూపితేనే ఇది పూర్తిగా ఆగిపోతుందని షోయబ్ అక్తర్ అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/