బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి కలిశారు. సోమవారం పార్టీ ఆఫీస్ కు వచ్చిన ఆమె తన భర్త ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ తరఫున సాయం అందించాలని కోరారు. తన భర్తపై పార్టీపరంగా విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నందు వల్లే తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని ఈ సందర్బంగా ఆమె పేర్కొంది.
రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే బండి సంజయ్ లేఖ రాశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీపరంగా రాజాసింగ్ కు న్యాయ సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈనేపథ్యంలో త్వరలోనే రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉందని వినికిడి. ఇప్పటికే పార్టీ తరఫున రాజాసింగ్ కు రఘునందన్ రావు, రామచంద్రరావు న్యాయ సహాయం అందిస్తున్నారు.