పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానం అమలు
అమరావతిః పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్ చొప్పున కేవలం ఆరు పరీక్షలే నిర్వహించనున్నారు. ఈమేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్ చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు.
అయితే కరోనా నేపథ్యంలో వాటిని ఏడింటికి కుదించారు. అయితే సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో ఇవ్వనున్నారు. అయితే ఆన్సర్ బుక్లెట్లు మాత్రం రెండూ ఇవ్వనున్నారు. ఒక దానిలో భౌతికశాస్త్రం, మరో దానిలో జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ రెండు సబ్జెక్టుల పేపర్లను వేర్వేరుగా పీఎస్, బీఎస్ టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున రెండు వేర్వేరు ఆన్సర్ బుక్లెట్లు ఇవ్వనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/