కాసేపట్లో మోడీతో సమావేశం కానున్న ఏపీ సీఎం

,

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో ప్రధాని మోడీ తో భేటీ కాబోతున్నారు. ఆదివారం రాత్రి 9.40 గంటలకు ఢిల్లీకి చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాస గృహం జన్‌పథ్‌ 1కు వచ్చారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రధానితో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, నిధుల విడుదల తదితర విషయాల గురించి చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత వీలును బట్టి కేంద్ర మంత్రులను కూడా కలువనున్నారు. అనంతరం అపాయింట్‌మెంట్‌లను అనుసరించి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలతో భేటీ కానున్నట్లు సమాచారం.

పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిసింది. అవసరమైతే సోమవారం రాత్రి కూడా ఢిల్లీలోనే బస చేసి మంగళవారం కూడా కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం.