త్వరలో నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుందిః అమిత్ షా

సీఆర్ పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాలన్న కేంద్ర హోంమంత్రి

amit-shah-speech-at-national-police-academy-in-hyderabad

హైదరాబాద్‌ః బ్రిటిషర్ల కాలం నాటి చట్టాలకు కాలం చెల్లిందని, వాటి స్థానంలో కొత్త చట్టాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వం కొత్త నేర చట్టాల బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు. త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 75వ బ్యాచ్ ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో అమిత్ షా పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న 175 మంది ట్రైనీ ఐపీఎస్ ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ట్రైనీ ఐపీఎస్ లను ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడారు.

సీఆర్ పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాలు బ్రిటిష్ పాలన కాలం నాటివని, ప్రస్తుత పరిస్థితులకు ఇవి సరిపోవని అమిత్ షా అన్నారు. శాసనాలకు రక్షణ కల్పించడమే వీటి ఉద్దేశమని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల హక్కులను కాపాడడమే లక్ష్యంగా కొత్త చట్టాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సమాజానికి సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. హవాలా, నకిలీ నోట్ల చలామణి, క్రిప్టో కరెన్సీ వంటి సవాళ్లపై పటిష్ఠంగా పోరాడాలని ట్రైనీ ఐపీఎస్ లకు ఆయన సూచించారు. అమరవీరుల బలిదానాన్ని ప్రేరణగా తీసుకుని కర్తవ్య నిర్వహణలో పట్టుదలగా ఉండాలని అమిత్ షా చెప్పారు.