శ్రీవారి సేవలో అమిత్ షా దంపతులు
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/Amit-Shah-couple-visited-Tirumala-Srivara.jpg)
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో పలువురు అగ్ర నేతలు తీర్థయాత్రల బాటపట్టారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కన్యాకుమారి చేరుకున్న మోడీ అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం లోకి వెళ్లిపోయారు. ఇక తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ప్రముఖ దైవక్షేత్రం తిరుమల వెళ్లారు.
సతీమణితో కలిసి అమిత్ షా గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఇక రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న అమిత్ షా దంపతులకు తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అమిత్ షా దంపతులను శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.