రెండోసారి విజ‌య‌వంతంగా ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు

ఈ తెల్లవారుజామున 3 గంటలకు కక్ష్య పెంపు విన్యాసం

Aditya -L1 successfully completes second earth-bound manoeuvre: ISRO

బెంగళూరుః సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు. ఆదివారం తొలిసారి ఉపగ్రహం కక్ష్యను పెంచిన శాస్త్రవేత్తలు రెండోసారి నేటి తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యపెంపు విన్యాసాన్ని చేపట్టారు. ఈ మేరకు ఇస్రో ఎక్స్ చేసింది. బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్‌లోని గ్రౌండ్ స్టేషన్లు ఆదిత్య గమనాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నేడు చేపట్టిన విన్యాసం ద్వారా ఆదిత్య ఉపగ్రహం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమించనుంది. ఈ నెల 10న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మూడో కక్ష్య పెంపు విన్యాసాన్ని చేపడతారు.

శనివారం శ్రీహరికోట నుంచి బయలుదేరిన ఆదిత్య ఎల్-1ను హాలో ఆర్బిట్ అయిన లాంగ్రాంజియన్ పాయింట్-1 (ఎల్-1) లో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహం సూర్యుడికి సమీపంగా వెళ్లడం కానీ, సూర్యుడి మీద లాండింగ్ కానీ ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం ఆదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపిస్తుంది. ఆ తర్వాత కూడా మరో 10-15 సంవత్సరాల వరకు అది పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.