మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నవదీప్ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
హైదరాబాద్: నటుడు నవదీప్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన నవదీప్ను నార్కోటిక్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ విక్రేత రామ్చందర్తో ఆయనకున్న లింకులపై ఆరాతీస్తున్నారు. ఎవరి వద్ద డ్రగ్స్ కొంటున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నవదీప్ను వినియోగదారుడిగా చేర్చారు. ఆయన ద్వారానే సినీ పరీశ్రమకు డ్రగ్స్ సరఫరా అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ను పోలీసులు 37వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నార్కోటిక్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసుల ముందుకు వచ్చారు.