నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం..ఆరుగురు భారతీయులు సహా ఏడుగురి మృతి

ఖాట్మాండు నుంచి జానక్ పూర్ వెలుతుండగా లోయలో పడ్డ బస్సు

6 Indian Pilgrims Among 7 Dead In Road Accident In Nepal’s Bara District

ఖాట్మండుః గురువారం(ఈరోజు) ఉదయం నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 26 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా.. అందులో ఆరుగురు భారతీయులేనని నేపాల్ అధికారులు తెలిపారు. రాజస్థాన్ నుంచి తీర్థయాత్రలకు వచ్చిన వారిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాత్రీకులను బస్సులో నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిని హెటౌడలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన పలువురు నేపాల్ లో తీర్థయాత్రలకు వచ్చారు. మిగతా యాత్రికులతో కలిసి గురువారం ఉదయం బస్సులో ఖాట్మాండు నుంచి జానక్ పూర్ బయలుదేరారు. జీత్‌పూర్ సిమారాలోని చురియమై ఆలయం సమీపంలో బస్సు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న 15 మీటర్ల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, ప్రమాదం తర్వాత ప్రాణాలతో బయటపడ్డ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.