మధ్యప్రదేశ్‌లో ఘోరం..మూఢనమ్మకాలకు 3 నెలల చిన్నారి బలి..

న్యూమోనియో సోకిన చిన్నారిని ఆసుపత్రికి కాకుండా మంత్రగాళ్ల దగ్గరికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

3-month-old-baby-dies-after-poked-51-times-with-hot-iron-rod-to-treat-pneumonia

భోపాల్‌: మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలకు ఓ పసికందు బలి అయింది. వ్యాధి తగ్గుతుందని 3 నెలల చిన్నారికి 51 సార్లు పొట్ట భాగంలో వాతలు పెట్టారు. దీంతో ఇన్ఫెక్షన్ ఎక్కువై చిన్నారి కన్నుమూసింది. గిరిజనులు ఎక్కువగా ఉండే షాదోల్‌ జిల్లాలోని సింగ్‌పుర్‌ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి న్యూమోనియా బారినపడింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. కానీ చికిత్స కోసం తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా.. స్థానికంగా ఉన్న మంత్రగాళ్లకు చూపించారు.

వ్యాధి తగ్గిస్తామని చెప్పి మంత్రగాళ్లు అమానుషానికి పాల్పడ్డారు. పాప పొట్ట చుట్టూ కాల్చిన ఇనుప రాడ్డుతో ఒకటీ రెండు కాదు ఏకంగా 51 సార్లు వాతలు పెట్టారు. దీంతో చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించింది. తప్పు తెలుసుకున్న తల్లిదండ్రులు పసికందును స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. న్యూమోనియాకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువైంది. 15 రోజులపాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి చిన్నారి మృతి చెందింది. పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

‘‘శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా.. 15 రోజుల కిందట జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. మూఢనమ్మకాలతో చిన్నారికి సరైన వైద్యం అందించకపోవడంతో ఆరోగ్యం క్షీణించి మరణించింది’’ అని షాదోల్ కలెక్టర్ వందన వైధ్ తెలిపారు. అధికారులు చిన్నారిని ఖననం చేసిన చోటుకెళ్లి.. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టారు.