తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర భేటీ

టిఆర్ఎస్ నేతలపై కొనసాగుతున్న ఐటీ, ఈడీ దాడులు

trs-mlas-emergancy-meeting-at-telangana-bhavan

హైదరాబాద్‌ః గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు, విచారణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరుస దాడులతో టిఆర్ఎస్ నేతల్లో అలజడి మొదలైంది. తాజాగా ఈరోజు మంత్రి మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు, కూతురు, ఆయన అల్లుడు, వియ్యంకుడి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. దాదాపు 50 బృందాలు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో దాడులు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. హైదరాబాదులోని మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిస్తున్నారు. ఈడీ, ఐటీ దాడులను ఎలా తిప్పికొట్టాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ కు చెందిన ఒక కీలక నేతకు ఈడీ నోటీసులు రావచ్చని, హైదరాబాద్ లోని కొందరు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు రావచ్చని టిఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈడీ, ఐటీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టే అంశంపై కూడా వీరు చర్చిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/