ముకేశ్‌ అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు

విదేశాల్లోనూ Z+ సెక్యూరిటీ కల్పించాలంటూ..ఆదేశాలు

SC orders to provide Z-plus security to businessman Mukesh Ambani & his family in India & abroad

న్యూఢిల్లీః అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అలాగే ఆయన కుటుంబ సభ్యుల భద్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ కుటుంబానికి ముంబయిలోనే కాకుండా దేశ విదేశాల్లోనూ Z+ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీముఖేష్ అంబానీనే భరిస్తారని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, అంబానీ సెక్యూరిటీ గురించి త్రిపుర కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఆ పిటిషన్ లో అంబానీ కుటుంబం భద్రత మహారాష్ట్రకు మాత్రమే పరిమితమా? దేశ విదేశాల్లోనూ అమలు చేస్తరా? అన్న అంశాలపై స్పష్టత నివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ముఖేష్‌ అంబానీ ఇండియాలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సూచించింది.

Z+ సెక్యూరిటీ అంటే..
Z + సెక్యూరిటీలో భాగంగా ఎప్పుడూ అంబానీ ఫ్యామిలీ చుట్టూ మొత్తం 58 మంది కమాండోలు ఉంటారు. వీరితో పాటు 10 మంది సాయుధ స్టాటిక్ గార్డ్‌లు, 24 మంది జవాన్లు 2 ఎస్కార్ట్స్‌ రెండు షిఫ్టులలో పనిచేస్తారు. వీరందరికి ఇన్‌స్పెక్టర్ లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు.