ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ను ప్రారంభించిన ర‌క్ష‌ణ‌మంత్రి

జాలోర్‌: ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు రాజ‌స్థాన్‌లోని జాలోర్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. దేశంలో 20 ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. హైవేల‌పై అనేక చోట్ల హెలిప్యాడ్ల‌ను కూడా నిర్మిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇదో గొప్ప ఘ‌న‌త అన్నారు. ఆర్మీ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ చెప్పారు.

ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్స్‌ను ప్ర‌కృతి విపత్తు స‌మ‌యంలో రెస్క్యూ ఆప‌రేష‌న్స్ కోసం కూడా వాడ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. జాలార్‌లో ఉన్న ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ వ‌ద్ద‌.. మూడు హెలిప్యాడ్ల‌ను కూడా నిర్మించిన‌ట్లు మంత్రి చెప్పారు. అంత‌ర్జాతీయ బోర్డ‌ర్ వ‌ద్ద ల్యాండింగ్ ఫీల్డ్ ఉండ‌డం భార‌త్ సంసిద్ధ‌త‌ను చూపుతుంద‌ని, దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ను కాపాడుకునేందుకు ఇదో మార్గ‌మ‌న్నారు. భార‌త్ ఎటువంటి స‌వాళ్ల‌ను అయినా ఎదుర్కొనే సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు.

సాధార‌ణంగా ఏదైనా కొత్త ఐడియా వ‌స్తే, దానిపై అనుమానాలు వ్య‌క్తం అవుతాయ‌ని, కానీ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌కు ర‌క్ష‌ణ‌శాఖ‌, వైమానిక ద‌ళం ఓకే చెప్ప‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. జాలోర్‌లో మూడు కిలోమీట‌ర్ల పొడువైన ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను నిర్మించిన‌ట్లు మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. అంత‌కుముందు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.. సీ-130, సుఖోయ్‌, జాగ్వార్ యుద్ధ విమానాల‌ను జాలోర్ హైవేపై దించారు.

దేశ‌వ్యాప్తంగా 20 చోట్ల ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ : ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/