ఫిర్యాదు చేసినా స్పందించని జీహెచ్ఎంసీ.. ఆఫీస్‌లో పామును వదిలిన యువకుడు

అల్వాల్‌ జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయంలో ఘటన

GHMC
GHMC

హైదరాబాద్‌ః భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో పలు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుతోంది. మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు పాములు కూడా వస్తున్నాయి. అల్వాల్ పరిధిలో ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు.

ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్‌‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి గంటలు గడిచినా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోకపోవడం ఆ కుటుంబంలోని ఓ యువకుడికి కోపం తెప్పించింది. సదరు పామును పట్టుకుని జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకి తెచ్చి వదిలాడు. ఆఫీసులోని టేబుల్‌పై పామును వదిలి నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.