కర్ణాటక రాజకీయ చరిత్రను ప్రధాని చదవాలిః ప్రియాంక్ ఖర్గే
హైదరాబాద్ ః బెంగళూర్ : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎంతకాలం సీఎం పదవిలో ఉంటారోనని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేసిన సందేహాలపై కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే దీటుగా బదులిచ్చారు. కర్ణాటక రాజకీయ చరిత్రను ప్రధాని మోదీ చదవాలని హితవు పలికారు. సిద్ధరామయ్య పదవీకాలంపై ప్రధాని మోడీ సందేహాలు వ్యక్తం చేయడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. బిజెపి హయాంలో ఎనిమిదేండ్లలోనే ఐదుగురు ముఖ్యమంత్రులు మారారని ప్రియాంక్ ఖర్గే ఎద్దేవా చేశారు.
కర్ణాటకలోని కలబురగిలో ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. గత బిజెపి సర్కార్ను 40 పర్సెంట్ ప్రభుత్వమని వార్తా పత్రికలు పేర్కొన్నాయని గుర్తుచేశారు. కర్ణాటకలో బిజెపి సర్కార్ను కూలదోసిన ప్రజలు బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. కర్నాటకలో బిజెపి నిర్వాకం అలాగ ఉందని ఖర్గే చురకలు వేశారు. రాజకీయ చర్చకు కాంగ్రెస్ సిద్ధమని కానీ ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక రాజకీయ చరిత్రపై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు.
కర్ణాటక సీఎం పదవిలో ఎవరుండాలనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఈ విషయంలో ప్రధానికి ఎందుకంత ఆసక్తని ఖర్గే నిలదీశారు. కాగా, అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమని ప్రియాంక్ ఖర్గే ఇటీవల పేర్కొన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గతంలో సీఎం పదవికి పోటీపడగా తాజాగా సీఎం రేసులో ఖర్గే పేరు వినిపిస్తుండటంతో కర్నాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.