రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి – సీఈవో
జులై 18 న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. NDA నుండి ద్రౌపది ముర్ము బరిలోకి దిగగా, విపక్ష పార్టీల తరుపున యశ్వంత్ సిన్హా దిగారు. కాగా ఎన్నికల పోలింగ్ కు గంటల సమయం మాత్రమే ఉండడం తో ఎన్నికల అధికారులు పోలింగ్ కు సంబదించిన పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక తెలంగాణ శాసనసభలో చేసిన ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. సోమవారం జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. అసెంబ్లీలోని మొదటి కమిటీ హాల్లో 2 ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీలో 119 తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని , అలాగే ఏపీ కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి హైదరాబాద్లోనే ఓటు వేస్తారని తెలిపారు. ఓటేసేందుకు ఈసీ ఇచ్చిన పెన్నునే ఎమ్మెల్యేలు వాడాలని చెప్పారు. ఇతర పెన్నులు వాడితే ఓటు చెల్లదు అని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే..రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దేశంలోని అన్ని రాష్ట్రాల శాసన సభ్యులు, లోక్ సభ, రాజ్య సభ ఎంపీలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లోని నామినేటెడ్ సభ్యులకు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. మొత్తం ఓటర్లు 4,809 మంది కాగా, ఇందులో ఉభయ సభల ఎంపీలు 776 మంది, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు 4,033 మంది. మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఇందులో ఎంపీల ఓట్ల విలువ 5,43,200. ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,43,231. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ప్రాధాన్యతా ఓటు పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఓటు సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్ను ఏర్పాటు చేస్తుంది, దానితోనే ఓటు వేయాల్సి ఉంటుంది.
పోలింగ్లో పాల్గొనే సభ్యుల వివరాలు చూస్తే..
ఎంపీలు (ఉభయ సభలు) – 776
అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు – 4,033
మొత్తం ఓటర్లు – 4,809
మొత్తం ఓట్ల విలువ…
ఎంపీలది – 5, 43, 200
ఎమ్మెల్యేలది – 5,43, 231
మొత్తం ఓట్ల విలువ – 10, 86, 431
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ….
నోటిఫికేషన్ – జూన్ 15
నామినేషన్ దాఖలుకు చివరి తేది జూన్ 29
నామినేషన్ల పరిశీలన – జూన్ 30
నామినేషన్ల విత్ డ్రా – జులై 2
పోలింగ్ – జులై 18
ఓట్ల లెక్కింపు – జులై 21.