ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం

39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై అభ్యంతరం

brs

హైదరాబాద్‌ః అసెంబ్లీలో ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బిఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు చిన్న గదిని ఇవ్వడం ఏమిటి? అని నిలదీశారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మొదట సభాపతి కావాలని అడగడంతో ఎల్‌వోపీని ఇచ్చామని… స్పీకర్ మీద గౌరవంతో మాత్రమే ఇచ్చినట్లు చెప్పారు.

తమ ఎల్‌వోపీకి అంతే పెద్ద ఛాంబర్ ఇస్తామని హామీ ఇచ్చారని కానీ చిన్న గదిని కేటాయించడం సరికాదన్నారు. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ఎల్‌వోపీ గదిని వారి సౌకర్యం కోసం ఇవ్వడానికి కెసిఆర్ అంగీకరించారన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఐదుగురు ఉన్నప్పుడు కూడా మేము ఎల్‌వోపీ రూమ్ ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్‌వోపీకి పెద్ద ఛాంబర్ కేటాయించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో తమ పార్టీకి చెందిన చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన ఎమ్మెల్యే భార్యకు ప్రోటోకాల్ ఇస్తున్నారన్నారు. స్థానిక ఆర్డీవో కూడా అలానే చేస్తున్నారని… అందుకే తాము ఆర్డీవోపై పిర్యాదు చేశామని చెప్పారు. ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై డీజీపీ పునరాలోచన చేయాలన్నారు. ప్రభుత్వాలు వస్తాయి… పోతాయి… ముఖ్యమంత్రులు, వస్తారు… పోతారని… కానీ నిబంధనలు ఒకేలా ఉండాలన్నారు.

బిఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు వస్తారన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేగా గెల‌వ‌ని జ‌గ్గారెడ్డి.. మా ఎమ్మెల్యేల‌నే తీసుకెళ్తారా? అని ఎద్దేవా చేశారు. మా ఎమ్మెల్యేల‌ను తీసుకెళ్లేంత మొగోళ్లు కాంగ్రెస్‌లో లేరన్నారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని అడిగితే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోతే అంత‌ర్యుద్ధం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.