జీ20 సెక్రటేరియట్‌లో ప్రధాని మోడీ ఆకస్మిక పర్యటన

pm-modi-meets-officials-at-g20-secretariat

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ20 సెక్రటేరియట్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ కూడా సెక్రటేరియట్​కు వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులను పలకరించారు. జీ20 సదస్సును విజయవంతం చేసేందుకు శ్రమించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

జీ20 సదస్సుకు సంబంధించి తన అనుభవాలను మోడీ అధికారులతో పంచుకోగా.. వారు కూడా వారి అనుభవాన్ని ప్రధానితో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా అన్ని స్థాయిల్లోని సిబ్బందితో మోడీ సంభాషించారు. భారత్‌ నేతృత్వంలో జీ20 సదస్సు విజయవంతంగా ముగియడం.. ప్రపంచ దేశాలు, ఆ దేశాల అగ్రనేతలు భారత్​ను ప్రశంసించడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం వెనక జీ20 సెక్రటేరియట్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అధికారుల కృషి ఎంతో ఉందని మోడీ అన్నారు. ఈ క్రమంలోనే వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జీ20 సదస్సును విజయవంతం చేసేందుకు విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి 114 మంది అధికారులను ఈ సెక్రటేరియట్‌లో నియమించిన విషయం తెలిసిందే. ఆగస్టులో అదనంగా మరో 140 మంది యువ అధికారులను ఇందులో చేర్చారు. ఈ బృందానికి షెర్పా అమితాబ్‌ కాంత్‌, ప్రధాన సమన్వయకర్త హర్ష్‌ ష్రింగ్లా మార్గదర్శకత్వం వహించారు.