ఏపీ పెట్రోల్ బంకుల్లో భారీ మోసం

పెట్రో బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా..అయితే మీరు లీటర్ కొట్టిస్తే..మీ వాహనం ట్యాంక్ లో పడేది లీటర్ కాదు పావు లీటర్ తక్కువే..అదేంటి అనుకుంటున్నారా..ఇలా కొన్ని బంకులదారులను వాహనదారులను మోసం చేస్తున్నారు. బంకుల్లో మైక్రో చిప్ లు అమర్చి వాహన దారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. లీటరు పెట్రోల్ లో దాదాపు పావు లీటరు కొట్టేస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు కొలతలశాఖ చేపట్టిన తనిఖీల్లో మరోసారి మైక్రో మాయ బయటపడింది. ఒకటి రెండు కాదు దాదాపు 600 బంకుల్లో తనికీలు చేయగా అందులో 17 బంకుల్లో ఇలాగే మోసం చేస్తున్నట్లు బయటపడింది. వీరు రోజూ రూ.లక్షలలో మోసం చేస్తున్నారు. డిస్‌ప్లే మిషన్‌కు లోపల 2 చిప్‌లు అమర్చి, కరెక్ట్ మేటర్ చూపించే విధంగా భారీ మోసం చేస్తున్నారు.

విజయవాడ గుణదలలో ఓ పెట్రోల్ బంక్ ను సీజ్ చేసి… యజమానిపై కేసు నమోదు చేశారు. ఏపీలో ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాల్లో ఈ మైక్రో మోసాలను గుర్తించారు. హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి పెట్రోల్‌ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఆ ముఠాను పట్టుకోవడంతోనే ఈ మోసాలకు చెక్‌ పడిందనుకుంటే పొరపాటే. పెట్రోల్‌ బంకుల్లో టెక్నాలజీ మారుస్తున్న కొద్దీ మోసగాళ్లు కూడా మరింతగా రాటుదేలుతున్నారు. లేటెస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని రివర్స్‌ ఇంజినీరింగ్‌తో ఏమారుస్తున్నారు. ఏటా తూనికలు–కొలతల శాఖ దాడులు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నా…పెట్రోలు బంకుల మదర్‌బోర్డులను మారుస్తున్నా… మోసాలు ఆగడం లేదు.