7, 8 తేదీల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ?

మోడి రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి విస్తరణ

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం సిద్ధమైంది. రేపు, లేదంటే ఎల్లుండి కేబినెట్‌ను విస్తరించనున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రివర్గంలో ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అలాగే, పశ్చిమ బెంగాల్‌కూ ప్రాతినిధ్యం పెరుగుతుందని సమాచారం. ఇక పలువురు మంత్రులకు ఉద్వాసన పలకనుండగా, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. బీజేపీ మిత్ర పక్షాలైన జేడీయూ, అప్నాదళ్ పార్టీల నుంచి కూడా ఒకరిద్దరికి బెర్తులు లభించే అవకాశం ఉంది. లోక్‌జనశక్తి చీలికవర్గం నేత పశుపతి పరాస్ కు కూడా మంత్రివర్గంలో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. 2019లో మోడి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి విస్తరణ కావడం గమనార్హం. గరిష్ఠంగా 20 మందికి బెర్తులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు, నేడు హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ముఖ్య నేతలతో మోడి సమావేశం కానుండడం కూడా కేబినెట్ విస్తరణ వార్తలను బలపరుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/