మరోసారి మంత్రి నిరంజన్ రెడ్డిఫై షర్మిల మాటల తూటాలు

వైస్ షర్మిల – టీఆరఎస్ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు ఒకరి ఫై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరుకుంటున్నారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టగా షర్మిల.. ఈ సందర్భాంగా మంత్రి నిరంజన్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే.. ఈ నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు.

నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడని షర్మిల అన్నారు. ఆయనకు, కుక్కకు తేడా ఏమైనా ఉందా..? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని మంత్రిపై షర్మిల ఫైర్ అయ్యారు. నిరంజన్ రెడ్డికి అధికార మదం తలకెక్కిందని ఆరోపించారు. ఇక షర్మిల చేసిన కామెంట్స్ ఫై నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే.. ఒక్కమాటకు వందమాటలు అంటాం.. ఆత్మ‌విశ్వాసంతో చీల్చి చెండాడుతామ‌ని తేల్చిచెప్పారు. రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటి చేసి నీ సత్తా ఏంటో చూపించాల‌ని ష‌ర్మిల‌కు నిరంజ‌న్ రెడ్డి స‌వాల్ విసిరారు.

నిరంజన్ వ్యాఖ్యలఫై షర్మిల మాట్లాడుతూ.. ఆయన ఒక వీధి కుక్క అని.. వైయస్సార్ గురించి తెలియకుండానే మొరిగితే… అబద్ధాలు నిజం కావని అన్నారు. వైయస్ మరణిస్తే 700 గుండెలు ఆగిపోయాయని తెలిపారు. ఇకనైనా నిరంజన్ రెడ్డి సిగ్గు తెచ్చుకుని వైయస్సార్ లా జీవించాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకే కాకుండా తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని… పథకాల పేరు చెప్పి, మోసపూరిత హామీలను ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బంగారు తెలంగాణ అనేది కేవలం కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమేనని షర్మిల అన్నారు.