రేపటి నుండి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర..

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర..ఇప్పటికే మూడు విడతలు విజవంతంగా సక్సెస్ కాగా రేపటి నుండి నాల్గో విడత మొదలుకానుంది. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. గణేష్, విజయదశమి నవరాత్రుల నేపథ్యంలో ఈసారి యాత్రను పది రోజులకే కుదించారు.

రేపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్న సంజయ్.. 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నందున ఆ రోజు పాదయాత్ర ఉండదు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్–కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.