తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్

మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని మునుగోడు ప్రజలకు రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మునుగోడు ప్రజలే తనకు దేవుళ్లని.. వారు ఏ తీర్పు ఇచ్చినా శిరసావమిస్తానని స్పష్టం చేశారు. బలహీనవర్గాలు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తాను నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు. కేసీఆర్ పతనం మునుగోడుతోనే మొదలవుతుందని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పీడ విరగడవుతుందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్.. ఈ నెల 21న మునుగోడులో జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.