శబరిమల ఎయిర్ పోర్టుకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్

విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం

Kerala`s Proposed Sabarimala Airport Receives Green Signal From Environment Ministry

న్యూఢిల్లీః ప్రతి యేటా లక్షలాది మంది భక్తులు మాలను ధరించి, నియమ, నిష్ఠలతో పూజలు చేస్తూ అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్తుంటారు. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో శబరిమలకు వెళ్లి వస్తుంటారు. ఎక్కువ గంటలు ప్రయాణం చేయలేనివారు, సమయం తక్కువ ఉన్నవారు విమానాల్లో వెళ్తుంటారు.

అయితే, శబరిమలకు విమానంలో వెళ్లాలంటే కొచ్చి లేదా తిరువనంతపురంకు వెళ్లాలి. కొచ్చిలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శబరిమలకు 160 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే తిరువనంతపురం నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 3,411 కోట్లతో ఎరుమేలిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2,570 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది.