త్వ‌ర‌లోనే తిరిగి వ‌స్తా..అర‌వింద్ కేజ్రీవాల్ లేఖ

Kejriwal’s Wife Shares Delhi CM’s Message From Jail

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్టయి ఈడీ క‌స్ట‌డీలో ఉన్న ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఓ లేఖ విడుద‌ల చేశారు. ఆ సందేశాన్ని ఆయ‌న భార్య సునీత శ‌నివారం చ‌దివి వినిపించారు. “ప్రియ‌మైన దేశ ప్ర‌జ‌లారా.. నేను ఎక్క‌డున్నా దేశ సేవ చేస్తూనే ఉంటా. నా జీవితమంతా దేశానికే అంకితం చేశా. ఇప్ప‌టివ‌ర‌కు జీవితంలో ఎంతో క‌ష్ట‌ప‌డ్డా.. అందుకే అరెస్టు న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌ర్చ‌లేదు. పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంది. భార‌త్‌లోని అనేక‌ శ‌క్తులు దేశాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయి. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఢిల్లీలోని మ‌హిళ‌ల‌కు ఇచ్చిన రూ. 1000 హామీని నిల‌బెట్టుకుంటా.

అలాగే స‌మాజ‌ శ్రేయ‌స్సు, ప్ర‌జా సంక్షేమం కోసం ప‌ని చేయాల‌ని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్య‌క‌ర్త‌లంద‌రికీ విన‌తి చేస్తున్నా. నేను జైలుకు వెళ్ల‌డంతోనే ఆగిపోకూడ‌దు. న‌న్ను జైలులో పెట్టినందుకు బీజేపీని ద్వేషించ‌వ‌ద్దు. ఎందుకంటే వారు కూడా మ‌న సోద‌రులు, సోద‌రీమ‌ణులు. త్వ‌ర‌లోనే తిరిగి వ‌స్తా” అని కేజ్రీవాల్ ఆప్ కార్య‌క‌ర్త‌ల‌కు త‌న లేఖ ద్వారా సందేశం పంపించారు.

ఇక ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసులో అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ గురువారం రాత్రి అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే, ఆయ‌న జైలు నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతార‌ని ఆప్ చెబుతోంది.