ఇకపై కెసిఆర్ ఆడబోయే ఆటను అందరూ చూస్తారుః కౌశిక్ రెడ్డి
హైదరాబాద్ః బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కెసిఆర్ చేత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు బిఆర్ఎస్ కీలక నేతలతో పాటు మంత్రి శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఈ కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణస్వీకారం చేశారని… ఇప్పటి నుంచి ఆట మొదలవుతుందని చెప్పారు. ఇకపై కెసిఆర్ ఆడబోయే ఆటను చూస్తారని అన్నారు.
అబద్ధాల పునాదులతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నిన్న ఇచ్చిన మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినవేనని చెప్పారు. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని… ఆ నోటిఫికేషన్ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.