ఈనెల 23 వరకు కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ

Kavitha is in judicial custody till 23rd of this month

న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో శని, ఆదివారం రెండు రోజులు ఆమెను అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఈరోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపరిచారు.

ఈ సందర్భంగా కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా, 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితను అధికారులు మరోసారి తిహాడ్ జైలుకు తరలించనున్నారు.

అయితే కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అన్నారు. బయట కమలం పార్టీ వాళ్లు మాట్లాడేదే, లోపల అధికారులు అడుగుతున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ కవితను అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు కోర్టులో కవితను కస్టడీకి కోరుతూ సీబీఐ, దిల్లీ మద్యం విధానం రూపకల్పన, అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారి అని తెలిపింది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు కస్టడీ కోరగా ఈనెల 14వ తేదీ వరకు కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. రెండ్రోజుల సీబీఐ కస్టడీలో అధికారులు కవితను మద్యం కుంభకోణంలో దాగి ఉన్న విషయాలు రాబట్టేలా వివిధ కోణాల్లో ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు తెలిసింది.