మీతో నేనెప్పుడైనా అసంబద్ధంగా వ్యవహరిస్తే వారికి క్షమాపణలు: జయాబచ్చన్
న్యూఢిల్లీ: నేడు రాజ్యసభలో తన చివరి ప్రసంగం సందర్భంగా ఎంపీ జయాబచ్చన్ చేతులో జోడించి క్షమాపణలు చెప్పారు. ఎంపీ జయాబచ్చన్ సాధారణంగా ఎప్పుడూ కోపంగా ఉంటుంది. ఆమె మాట తీరు కూడా కఠినంగా ఉంటుంది. ఇటీవల రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్పై కూడా ఆమె ఆవేశంలో కామెంట్ చేశారు. అయితే ఫేర్వెల్ స్పీచ్ సందర్భంగా జయాబచ్చన్ మాట్లాడుతూ.. తానో షార్ట్ టెంపర్ వ్యక్తినన్నారు. ఎవర్నీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నారు.
ఎందుకు ఎప్పుడూ ఆవేశానికి లోనవుతుంటావని అందరూ తనను ప్రశ్నిస్తారని, కానీ అది తన స్వభావం అని, దాన్ని మార్చుకోలేనని, ఏదైనా విషయాన్ని అంగీకరించలేని సమయంలో తాను తన సహనాన్ని కోల్పోనున్నట్లు ఆమె చెప్పారు. మీతో నేనెప్పుడైనా అసంబద్ధంగా వ్యవహరిస్తే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు జయాబచ్చన్ పేర్కొన్నారు.