వదర బాధితులకు నేటి నుండి ఆర్థిక సాయం
దాదాపు 34 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి సాయం..కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా ముంపు ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల చొప్పున అందిస్తామని నిన్న తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. అంతేగాక, వర్షాల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోతే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కెటిఆర్ స్పందించారు. ‘సిఎం కెసిఆర్ గారు చేసిన సూచనల మేరకు నేటి నుంచి వరద బాధితులకు ఆర్థిక సాయం అందిస్తాం. జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 34 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ప్రతినిధులు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తారు. వరద ప్రభావానికి గురైన ప్రతి కుటుంబానికి, వ్యక్తికి పూర్తిస్థాయిలో సాయం అందాలని కూడా కెసిఆర్ చెప్పారు. ఈ విపత్కర సమయంలో వరద బాధితులకు సాయం అందేలా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నివాసాల సంక్షేమ సంఘాలు, ఎన్జీవోలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సాయపడాలి’ అని కెటిఆర్ కోరారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/