హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో తొలిసారిగా గుండెను తరలించారు. మెట్రో రైలు అధికారుల సహకారంతో కామినేని ఆస్పత్రి వైద్యులు అపోలోకు గుండెను తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్యక్తికి అమర్చనున్నారు.
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె మార్పిడి శస్ర్తచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో ఈ శస్ర్తచికిత్స నిర్వహించనున్నారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి గుండెను మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తరలించారు. నాగోలు మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు గ్రీన్ ఛానెల్ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు. మెట్రో రైలు అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ ఏర్పాట్లు చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/