గాంధీ ఆసుప‌త్రిలో ‘జీనోమ్ సీక్వెన్సింగ్’ టెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లోనే ఇకపై జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో గాంధీ హాస్పిటల్ భారీ సంఖ్యలో టెస్టు చేపట్టింది. కరోనా కేసుల నిర్దారణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ చేస్తున్నారు.

రాజధాని నగరంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల శాంపిళ్లు ఎక్కువగానే వస్తున్నాయి. కానీ, వాటి జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల కోసం ఎక్కువ కాలం ఎరురుచూడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే గాంధీ హాస్పిటల్‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ వసతిని అందుబాటులోకి తెచ్చారు. తద్వార శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చిన వారి శాంపిళ్లను ఇక్కడే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనున్నారు. దీంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ), సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ)తోపాటు గాంధీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వచ్చింది. గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో సీడీఎఫ్‌డీ, సీసీఎంబీలపై భారం కొంత తగ్గనుంది. అలాగే, ఒమిక్రాన్ ఫలితాల కోసం ఎదురుచూసే కాలం తగ్గనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/