సిక్కిం వరదల్లో అలనాటి తెలుగు నటి గల్లంతు

స్నేహితులతో కలసి ఈ నెల 2న సిక్కిం పర్యటన

Former actress Sarala Kumari is missing in Sikkim

న్యూఢిల్లీః ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి ఇటీవలి సిక్కిం వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత ధ్రువీకరించారు. అమ్మ ఆచూకీని గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న సరళ కుమారి అక్టోబర్ 2న స్నేహితులతో కలసి సిక్కిం పర్యటనకు వెళ్లినట్టు ఆమె కుమార్తె చెప్పారు. అక్కడ ఓ హోటల్ లో బస చేసినట్టు తెలిపారు.

చివరిగా ఈ నెల 3న అమ్మతో ఫోన్ లో మాట్లాడానని, ఆ తర్వాత అమ్మతో సమాచారం లేదంటూ నబిత వెల్లడించారు. ‘‘వరదలు వచ్చినట్టు వార్తలు చూసి తెలుసుకున్నాను. ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసినప్పటికీ కలవడం లేదు’’ అని నబిత ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు. సరళ కుమారి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దాన వీర శూర కర్ణ’లో నటించారు. ‘సంఘర్షణ’ తదితర సినిమాల్లోనూ నటించారు.