అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం.. 42 మంది మృతి

కబీలీ ప్రాంతంలోని కొండలపై కార్చిచ్చు

ఆల్జీర్స్ : ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది సైనికులు సహా 42 మంది సజీవ దహనమయ్యారు. ఉష్ణోగ్రతలు పెరగడం, పొడి వాతావరణం కారణంగా అడవిలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటనలో కనీసం 42 మంది మరణించారని అధికారులు తెలిపారు. వీరిలో 25 మంది సైనికులు కాగా, 17 మంది సాధారణ పౌరులని పేర్కొన్నారు.

రాజధాని అల్జీర్స్‌కు తూర్పున ఉన్న కబీలీ ప్రాంతమైన కొండలపై మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగలతో ఆ ప్రాంతం కమ్ముకుపోయినట్టు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు ద్వారా తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వందమందికిపైగా ప్రజలను సైన్యం రక్షించింది. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, మరో 14 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/