టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఉచిత సామూహిక పెళ్లిళ్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఉచిత సామూహిక పెళ్లిళ్లకు ముహూర్తం ఫిక్స్ చేసారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7న కళ్యాణమస్తు ద్వారా ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నామని , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కళ్యాణమస్తును పునః ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పేద కుటుంబాల్లో తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నట్లు తెలిపారు.

ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని చైర్మన్ తెలిపారు. అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్‌ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.