ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందిః అంబటి రాయుడు

మంచిపనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతుంటారని వెల్లడి

cricketer-ambati-rayudu-came-into-support-for-volunteers

అమరావతిః వాలంటీర్ల విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు భగ్గుమంటున్న నేపథ్యంలో, భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికరంగా స్పందించారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అయితే, మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లడం సహజమేనని, అలాంటివాటిని పట్టించుకోకుండా నిర్భయంగా ముందుకు వెళ్లాలని రాయుడు సూచించారు. అసలు, వాలంటీర్ల వ్యవస్థ అనేదే గొప్ప ఆలోచన అని, ప్రతి మనిషికి ఏ సేవలు అవసరమో అవన్నీ వాలంటీర్ల ద్వారా పక్కాగా అందుతున్నాయని కొనియాడారు.

కరోనా వేళ ప్రాణాలకు తెగించి వాలంటీర్లు అందించిన సేవలు మరువరానివని స్పష్టం చేశారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ లేదని, ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని రాయుడు అన్నారు. ఇటీవల అంబటి రాయుడు పలుమార్లు సీఎం జగన్ తో సమావేశం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.