వారిది దొంగల ముఠా..వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో సీఎం జగన్
అమరావతి : పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… వలంటీర్ వ్యవస్థ ద్వారా 33 రకాల సేవలను ప్రతీ ఇంటికి అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది వలంటీర్లు.. లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు సీఎం జగన్. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని, వలంటీర్లు అంటే గొప్ప సైనికులు, గొప్ప సేవకులని ప్రశంసలు గుప్పించారు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున చిరుసత్కారం అందజేస్తున్నామని చెప్పారు సీఎం జగన్.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ దొంగల ముఠా అని అన్నారు. వీరిద్దరూ హైదరాబాద్లో మకాం వేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వారి దుర్మార్గపు ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ప్రజలను కోరారు. తాను మారీచులు, రాక్షసులతో నేను యుద్ధం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నాకు క్లాస్ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి, నేను మాత్రమే ఈ రూమ్ లో ఉన్నాము.. వీళ్లు ఆ సోఫా కింద ఉండి విన్నారా అని ప్రశ్నించారు.
గత పాలన కంటే వైస్సార్సీపీ పాలనలో అనేక మార్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. నవరత్నాల పేరుతో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ ఆ పార్టీలో కనిపిస్తుందని , దానికి అనుబంధంగా ఉన్న సహకరిస్తున్న మిగతా పార్టీల్లోనూ కనిపిస్తుందని జగన్ వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా పీఎన్సీ కళాశాల వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/