కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

సీఎం కేసీఆర్ సభలో ఓ వ్యక్తి బుల్లెట్లతో తిరగడం కలకలం రేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వద సభ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ భారీ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ , కాంగ్రెస్ బిజెపి పార్టీల ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. నేడు మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.

గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్‌ సభలో ప్రసంగిస్తుండగా..అస్లాం అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడం తో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని చెక్ చేయగా అతడి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన వ్య‌క్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అస్లాంను విచారిస్తున్నారు. బుల్లెట్లు ఎక్కడివి..? ఎందుకు తీసుకొచ్చాడు..? వాటితో ఏంచేయాలి అనుకున్నాడు..? వంటి ప్రశ్నలు అడుగుతూ దర్యాప్తు చేస్తున్నారు.