బెంగళూరు రేవ్ పార్టీ కేసు..నటి హేమకు నోటీసులు
![Bengaluru rave party case..Notices to actress Hema](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/The-entry-fee-of-that-rave-party-was-Rs.50-lakhs.-Hema-Telugu-actress-participated.Bangalore-Police-Commissioner.jpg)
హైదరాబాద్ః రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, అశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివానీ జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి.
బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శనివారం హైదరాబాద్లో ఏ2 నిందితుడు అరుణ్ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.