మరో బాదుడుకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్..
రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే అనేక పన్నులు విధిస్తు బాదుడు సీఎం అనిపించుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి..ఇప్పుడు మరో బాదుడుకు శ్రీకారం చుట్టారు. ఇంపాక్ట్ ఫీజు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపింది. నగరాలు, పట్టణాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించే వారు ఈ ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర చార్జీలకు అదనంగా ఇకపై ‘ఇంపాక్ట్ ఫీజు’ను కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మాస్టర్ప్లాన్ రోడ్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, బైపాస్ రోడ్లు, రింగ్రోడ్లను ఆనుకుని పక్కనే ఇళ్లు నిర్మించుకునేవారందరికీ ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న రహదారులతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, కొత్తగా రహదారుల నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్నచోటా ఫీజు కట్టాల్సిందేనని తెలిపింది. 60 అడుగులు, దానికిపైన.. 150 అడుగులలోపు వెడల్పున్న రహదారుల్ని ఆనుకుని నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకూ ఈ ఫీజు వర్తిస్తుంది. 150 అడుగులు, దానికి మించి వెడల్పున్న రహదారులకు రెండు పక్కలా 250 మీటర్ల దూరం వరకు నిర్మించే అన్ని రకాల భవనాలూ ఫీజు కట్టాల్సిందే. మరి ఈ బాదుడు ఫై రాష్ట్ర ప్రజలు , ప్రతిపక్ష పార్టీలు ఏమంటారో చూడాలి.