తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 10 ల‌క్ష‌ల మందికి ఈ నెల 15 నుండి కొత్త‌ పింఛ‌న్లు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గురువారం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంట‌ల పాటు ఈ సమావేశం జరిగింది.

అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి 10 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్‌ నిర్మించాలని నిర్ణయించారు. అలాగే, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి 10 మంది వైద్యులను నియమిస్తున్నట్టు తెలిపారు. సరోజినీ దేవీ కంటి ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు ఇచ్చారు.

వికారాబాద్‌లో ఆటోనగర్‌ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయించినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల 111 అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినేట్‌ పేర్కొంది. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను మంత్రివర్గం రద్దు చేసింది. అదేరోజు పెళ్లిల్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడంతో… ప్రజాప్రతినిధుల వినతుల మేరకు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని పేర్కొంది. జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినేట్‌ ఆదేశించింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఓ కమిటీ వేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇచ్చి, శాశ్వతంగా పరిష్కారం చూపాలని సూచించింది. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది.

తాండూరు మార్కెట్‌ కమిటీకి యాలాలలో 30 ఎకరాల స్థలం కేటాయింపు. షాబాద్‌ బండల పాలిషింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు 45 ఎకరాల స్థలం కేటాయింపునకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.