నేడు ఇజ్రాయెల్‌లో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ పర్యటన

Amid War, UK PM Rishi Sunak To Visit Israel Today

లండన్‌ః హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఈరోజు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇతర ప్రాంతీయ రాజధానులకు వెళ్లే ముందు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌తో సమావేశమవుతారని తెలిపింది.

కాగా, హమాస్‌ తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బైడెన్‌.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఈ యుద్ధంతో రెండు దేశాల్లో మరణాల సంఖ్యం అంతకంతకూ పెరుగుతోంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ వైపు 1,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 3000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడారు.