ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త లుక్ ఆవిష్కరణ

కొత్త డిజైన్‌తో మెరిసిపోతున్న బోయింగ్ విమానాన్ని ప్రదర్శించిన సంస్థ సీఈఓ

Air India Express unveils new look, aircraft livery

న్యూఢిల్లీః రీబ్రాండింగ్‌లో భాగంగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం తన కొత్త లుక్‌ను ప్రజల ముందుంచింది. మునుపటి డిజైన్‌కు భిన్నంగా కొత్త చిహ్నాలతో (లివరీ) మెరిసిపోతున్న బోయింగ్-737 విమానం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ ఆవిష్కరించారు. ఇది కేవలం కొత్త బ్రాండ్ డిజైన్ కాదని, తాము ఎవరో, తమ విజన్ ఏంటో ఈ మార్పులతో చెప్పదలుచుకున్నామని సంస్థ సీఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తుందన్నారు.

రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, చిహ్నాలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడేళ్లల్లో 170 నారో బాడీ విమానాలు కలిగిన సంస్థగా ఎదగాలని ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇటీవలే ఎయిర్ ఇండియా కొత్త లోగోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.