సౌదీ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారుల దాడి

విమానాశ్రయం లక్ష్యంగా దాడి

రియాద్‌: సౌదీ అరేబియాలోని అబా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విమానాశ్రయంలోని ఓ పౌర విమానం మంటల్లో చిక్కుకుంది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అబా విమానాశ్రయం లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు గతంలోనూ పలుమార్లు క్షిపణిదాడులకు దిగారు. అప్పట్లో ఆ దాడుల్లో పలువురు ప్రయాణికులు గాయపడినా, విమానానికి మంటలు అంటుకోవడం అన్నది మాత్రం ఇదే తొలిసారి.

ఈ ఘటనతో విమానాల ట్రాకింగ్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 2017లోనూ విమానాశ్రయంపై ఇలాంటి తరహా దాడే జరిగింది. సౌదీలోని చమురు కేంద్రాలపైనా తిరుగుబాటుదారులు దాడులు చేస్తూనే ఉన్నారు. 2015లోనే యెమెన్ రాజధానిని హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి దాడులు పెరిగాయి. అయితే, వారి వెనక ఇరాన్ ఉందన్నది సౌదీ ఆరోపణ.