సీఎం సంతకాలు చేసిన నిధులు మంజూరు కాలేదుః ఎమ్మెల్యే కోటంరెడ్డి

అధికారానికి దూరమైనా ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని వ్యాఖ్య

kotamreddy

నెల్లూరుః వైఎస్‌ఆర్‌సిపి బహిష్కృత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలంటూ ఆయన క్రమం తప్పకుండా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు వైఎస్‌ఆర్‌సిపి నేతల నుంచి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావని కొందరు, సమస్యలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా అని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలో కోటంరెడ్డి తాజాగా మాట్లాడుతూ..నెల్లూరు రూరల్ సమస్యల పరిష్కారం కోసం జగన్ మూడు సంతకాలు చేశారని… అయినప్పటికీ ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పెట్టిన సంతకాలకే దిక్కు లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు అనవసరమైన మాటలను మాట్లాడటం ఆపేసి, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని అన్నారు. తాను అధికారానికి దూరమైనా ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని చెప్పారు.