నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం కెసిఆర్

CM KCR will go to Delhi today

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో నిర్మించిన బిఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మే 4న సిఎం కెసిఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బిఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయి బిఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి.

ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్‌లో భవనానికి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం కెసిఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.