ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందిః ఎమ్మెల్సీ కవిత

హిజాబ్ విషయంలో వైఖరి చెప్పాలంటూ రాహుల్ గాంధీకి ప్రశ్న

brs-leader-mlc-k-kavitha-press-meet

హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర అని.. ప్రజలను మభ్యపెట్టడంలో ఆ పార్టీ ముందు ఉంటుందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని విమర్శించారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత సోమవారం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని డీఎంకే నేత హేళన చేసినపుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఉందని గుర్తుచేసిన కవిత.. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై మౌనాన్ని ఆశ్రయించడాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ.. తమ మిత్రపక్షం నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు.

కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాహుల్ గాంధీ వెల్లడించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తామని ఆమె చెప్పారు. ఆలోగా అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు.