బయో ఏషియా-2021 సదస్సును ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల పాటు నిర్వహిస్తుంది. ప్రపంచం నలు మూలల నుంచి 30 వేల మంది జీవశాస్ర్త నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫార్మా రంగం అభివృద్ధి, ఆరోగ్య రంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవ శాస్ర్త పరిశోధనలు, ఆవిష్కరణలపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్లాకు జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డులను మంత్రి కెటిఆర్ ప్రదానం చేశారు.
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కెటిఆర్ అన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయి. ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఎదురులేదన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫార్మా సెక్టార్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. జినోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్, బీ హబ్ ఏర్పాటు చేస్తామని కెటిఆర్ చెప్పారు.
ఈ అవార్డు తన ఒక్కనిది కాదు అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్కు దక్కినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్ నుంచే టీకాలు రావాలన్నారు. 65 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. అతిపెద్ద టీకా తయారీ హబ్గా హైదరాబాద్ సత్తా చాటుతుందన్నారు. జినోమ్ వ్యాలీ ప్రపంచంలోనే ఉత్తమ హబ్ అని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/